జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. వారి కోసం స్పెషల్ డ్రైవ్ వాహనాలు

by  |
జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. వారి కోసం స్పెషల్ డ్రైవ్ వాహనాలు
X

దిశ, సిటీబ్యూరో : హైదరాబాద్‌తోపాటు యావత్ దేశం, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి నగర ప్రజల చెంతకు చేరకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కనీసం పది రోజుల పాటు మిగిలిన అర్హులైన అందరూ పౌరులకు వాక్సిన్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున వాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

వైద్యారోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు ఉమ్మడిగా నిర్వహించే ఈ వాక్సిన్ ఉద్యమానికి కంటోన్మెంట్ పరిధిలో మినహా గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ కీలక పాత్ర పోషించనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 4,846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్‌లోని 360 వాదాలు, కాలనీల్లో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే 70 శాతానికి పైగా అర్హులైన 18 ఏళ్ల పైబడ్డ వారికి కొవిడ్ వాక్సిన్ ఇప్పించారు. వీరే కాకుండా ఇంకా మిగిలిపోయిన ఏ ఒక్కరినీ వదలకుండా వాక్సిన్‌ను వంద శాతం మందికి ఇప్పించేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 175 ప్రత్యేక సంచార వైద్య కొవిడ్ వాక్సిన్ వాహనాలను ఏర్పాటు చేసారు.

ఇదే కాకుండా కంటోన్మెంట్ పరిధిలో మరో 25 వాహనాలను వైద్య ఆరోగ్య శాఖతో కలిపి ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి కనీసం పది పదిహేను రోజుల పాటు ఈ స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. 100 శాతం వాక్సిన్ ఈ కార్యక్రమానికి ముందు రోజు జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ, ఎంటమాలజి బృందాలకు చెందిన సిబ్బంది ముందస్తుగా కాలనీలలో ఇంటింటికి వెళ్లి వాక్సిన్ వేసుకోని వారి జాబితా సేకరిస్తారు. వీరి వివరాలను వాక్సిన్ ఇచ్చే ఆరోగ్య సిబ్బందికి అందచేస్తారు.

దీనితో పాటు వాక్సిన్ తీసుకోని పౌరులకు.. ప్రత్యేక వ్యాక్సి్న్ బృందం ఏరోజు తమ కాలనీకి వస్తుంది, ఎక్కడి వస్తుంది, ఏ సమయంలో వస్తుందనే కాంటాక్ట్ వివరాలు కలిగిన ఒక కరపత్రం వారు అందిస్తారు.
కాలనీలు, బస్తీల్లో వంద శాతం అర్హులైన వారికి వాక్సినేషన్ పూర్తైన అనంతరం, ఆయా కాలనీలు, బస్తీలకు మరో ప్రత్యేక బృందం వెళ్లి వంద శాతం వాక్సిన్ పూర్తయిన అంశాన్ని పరిశీలిస్తారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ‘ మా కాలనీ/బస్తీలో వంద శాతం అర్హులైన వారికి వాక్సిన్ పూర్తయింది” అనే బ్యానర్ కూడా ప్రదర్శిస్తారు. ఈ కాలనీ సంక్షేమ సంఘాలకు 100 శాతం వాక్సిన్ పూర్తిచేసినందుకు జీహెచ్ఎంసీ ద్వారా ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందచేస్తారు.

ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా చేపట్టిన ఈ 100 శాతం వాక్సినేషన్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్విలు కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. కాగా, ఈ వంద శాతం వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.


Next Story