ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు ఇవే..!

by  |
ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు ఇవే..!
X

విద్య అందరికీ అందాలన్న లక్ష్యంతో ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే.. విద్యను వ్యాపార వస్తువుగా మార్చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లాభసాటి వ్యాపారమేదైనా ఉందా? అంటే విద్యారంగమేనన్న సంగతి బహిరంగ రహస్యం. అందుబాటులో లేని ఫీజులతో చదవించలేక తల్లిదండ్రులు, ఫీజులు చెల్లించలేదన్న ఒత్తిడితో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో.. ఈ నేపథ్యంలో ఫీజులపై నియంత్రణ తెచ్చినా ప్రజలకు ఉపయోగం లేకపోయింది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంది పలుకుతున్న సంగతి తెలిసిందే. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు కానుంది. మరోవైపు జగనన్న ముద్ద పేరిట మధ్యాహ్న భోజనంలో ఏముండాలన్న మెనూను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ యూనిఫాం, పుస్తకాలు ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని 180 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు 35 వేల రూపాయలుగా నిర్ణయించింది. అందులో 6 కళాశాలలకు అత్యధికంగా 70 వేల రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. సినీ నటుడు మోహన్ బాబుకు చెందిన చిత్తూరు జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్​‌తో పాటు, విజయవాడలోని పీవీపీ సిద్దార్థ, నెల్లూరులోని ఎన్​బీకేఆర్​ కళాశాల, భీమవరంలోని శ్రీవిష్ణు, ఎస్​ఆర్​కేఆర్​, కర్నూలులోని పుల్లారెడ్డి కళాశాలల్లో ఇంజనీరింగ్ విద్యనభ్యసించే విద్యార్థులు ఈ భారీ ఫీజు భరించాల్సి ఉంటుంది.

అడ్మిషన్ ఫీజు పేరిట భారీ వసూళ్లకు పాల్పడే ప్రైవేటు కాలేజీలకు షాక్‌నిస్తూ, ప్రవేశ రుసుముగా కేవలం 2,000 రూపాయలే వసూలు చెయ్యాలని ఆదేశించింది. జేఎన్టీయూ, ఏయూ వంటి యూనివర్సిటీల్లో కూడా 2000 రూపాయలే అడ్మిషన్ ఫీజుగా నిర్ణయించింది. అయితే ఆ మొత్తంలో కేవలం 500 రూపాయలు మాత్రమే అడ్మిషన్ ఫీజుగా తీసుకోగా, 1500 రూపాయలు ఇతర నిర్వహణా వ్యయాలుగా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. యూనివర్సిటీ అందించే సేవలకు గాను 1,850 రూపాయలు ఫీజుగా వసూలు చేసుకోవచ్చని తెలిపింది.

Tags: andhra pradesh, college fees, private colleges, university fees

Next Story

Most Viewed