కరోనా దేవతకు మేకపోతును బలిచ్చి ప్రత్యేక పూజలు

by  |
Corona
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రజలు కకావికలం అవుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వదలడం లేదని పెద్దపల్లి జిల్లాకు చెందిన బుడిగె జంగాల ప్రజలు వింత పూజలు చేశారు.

కరోనా వైరస్‌ను పోలిన బొమ్మను తయారు చేసి, దానిపై పసుపు, కుంకుమలతో పూజించి పూజలు చేశారు. ‘‘కరోనా మహమ్మారి తల్లి.. మమ్ముల్ని కనికరించు.. మముల్ని, దేశాన్ని వదిలి వెళ్లిపో తల్లి.. నీకు మేకపోతును నైవేధ్యంగా ఇస్తున్నాం.. ఆరగించి మాయమైపో మాయమ్మ.. అంటూ గోదావరిఖని పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన బుడిగె జంగాల కాలనీ వాసులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలను విడిచి వెళ్లాలని కరోనాను దేవతగా అభివర్ణిస్తూ వేడుకున్నారు.

Corona 2

కరోనా సోకి ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న చాలామంది చనిపోతుండడం బుడిగె జంగాలనుత కలిచి వేసింది. ఇళ్లలో ఉన్న వారిని కూడా వెంటపడి మరీ వ్యాధి సోకుతుండడంతో బుడిగె జంగాలు చివరకు కరోనా వైరస్ నే వేడుకుంటే కనికరిస్తుందేమోనన్న ఆశతో ఈ కార్యక్రమం నిర్వహించారు. మా దేశం వదలిపెట్టి, మా బిడ్డలు క్షేమంగా ఉండేందుకు మమ్మల్ని కనికరించాలంటూ వారు కరోనా వైరస్ నే వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. వినూత్నంగా సాగిన ఈ పూజలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.



Next Story