మావోయిస్టు నేత హరి భూషణ్ మృతిని నిర్ధారించిన ఎస్పీ సునీల్ దత్

by  |
SP-Suni-Dutt
X

దిశ, కొత్తగూడెం : మావోయిస్ట్ పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషణ్(50) గత కొంత కాలంగా కరోనా వైరస్ సోకి బాధపడుతూ సోమవారం(21.06.2021) రోజున ఉదయం గుండె నొప్పితో మరణించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలతో సహా క్రింది స్థాయి సభ్యులు, మిలీషియా కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు గతంలోనే చెప్పామని అన్నారు. మావోయిస్ట్ పార్టీ నేతలు కూకటి వెంకన్న, శారద, సోను, వినోద్, నందు, ఇడుమ, దేవె, మూల దేవేందర్ రెడ్డి, దామోదర్, భద్రులు కూడా కరోనా సోకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందిందని, కానీ, మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ నేతలు.. మావోయిస్టు పార్టీలో ఎవరూ కూడా కరోనా బారిన పడలేదని ప్రకటనలు విడుదల చేసినట్టు తెలిపారు.

అయితే.. తెలంగాణ స్టేట్ కమిటీ కార్యదర్శి హరిభూషణ్(50) మరణంతో మావోయిస్ట్ పార్టీలోని అగ్రనాయకులు, క్రింది స్థాయి నాయకులు, సభ్యులు కూడా కరోనా సోకి బాధపడుతున్నట్లు రుజువైందని అన్నారు. సరైన వైద్యం అందక సోబ్రాయి, నందు, హరిభూషణ్, ఇతర నాయకుల మరణాలకు మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీలోని నాయకులు, సభ్యులు కరోనా సోకి సరైన వైద్యం అందక ప్రాణాలను కోల్పోతున్నారని వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీని వదిలి బయటకు రావాలని చూస్తున్న నాయకులు, సభ్యులను పార్టీ అగ్రనాయకత్వం బయటకు రానివ్వకుండా అడ్డుపడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు తెలిపారు.

తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషణ్ మరణంతో రాష్ట్రంలో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తమ ఉనికిని కోల్పోయినట్టు తెలిపారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీలో కరోనా సోకి ఇబ్బందులు పడుతున్న నాయకులు.. పోలీసుల ఎదుట లొంగిపోయి మెరుగైన వైద్యం పొందవలసిందిగా ఎస్పీ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను పోలీసు శాఖ తరఫున అందేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

Next Story

Most Viewed