దూ…రం ఏదీ ?

by  |
దూ…రం ఏదీ ?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ/మహబూబ్‌నగర్: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. రాష్ర్టంలో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నియంత్రణ చర్యలు పాటించాలని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా కొందరికి అవి పట్టడం లేదు. బ్యాంకుల్లో ఓకే చోటు గుమిగూడుతున్నారు. బస్సుల్లో సైతం పక్కపక్కనే కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. దీంతో వైరస్ తీవ్రత పెరిగే ప్రమాదముంది. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. వైరస్​ నివారణకు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం జనాల్లో అవగాహన కలిగించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. కానీ, కొంతమంది ప్రజలు మాత్రం… ఎవరెంత నెత్తీ, నోరు బాదుకొని వేడుకుంటున్నా… తమకేమీ పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కరోనా మహమ్మారిని తక్కువ అంచనా వేస్తూ… వైరస్​ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఓ వైపు వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో రైతులు బ్యాంకులకు వస్తున్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన డబ్బలు బ్యాంకుల్లో జమకావడంతో నగదు తీసుకునేందుకు వారు సైతం బ్యాంకులకు వస్తున్నారు. ఈ సమయంలో వారు భౌతికదూరం పాటించడం లేదు. ఆర్టీసీకి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం బస్సుల్లోనూ భౌతికదూరం పాటించాలని ఆక్యుపెన్సీకి సంబంధించి నిబంధనలు విధించింది. కానీ ప్రయాణికులు పక్కపక్క సీట్లోనే కూర్చుని ప్రయాణం చేస్తున్నారు.

రైతుబంధు డబ్బులు డ్రా చేయడానికి వచ్చా: సిరిపంగి అంజయ్య, కొత్తగూడెం

రైతుబంధు డబ్బులు తీసుకుందామని బ్యాంకుకు వచ్చాను. కానీ ఇక్కడ జనం బారులు తీరారు. వెనక్కు పోదామంటే పైసలు అర్జెంటాయె. క్యూలో నిల్చుందామంటే కరోనా భయం. ఎం అర్థం కావడం లేదు.

Next Story

Most Viewed