తెలంగాణలోనూ పొంచిన కెమి‘కిల్’ ముప్పు..!

by  |
తెలంగాణలోనూ పొంచిన కెమి‘కిల్’ ముప్పు..!
X

దిశ, మెదక్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఎల్‌జి పాలిమర్స్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన అందరికీ తెలిసిందే. ఆ ఘటనతో జిల్లాలోని స్థానికులూ ఆందోళన చెందుతున్నారు. వారి భయాందోళనకు కారణం జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు. ఏ మాత్రం అజాగ్రత్త వహించిన తమ ప్రాణాలు బలికాక తప్పదని అంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలున్నాయి. రకరకాల కంపెనీలు జిల్లాలో రన్ చేయబడుతున్నాయి. అయితే, నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ విరామం పాటు క్లోజ్‌లో ఉన్నాయి. సడలింపులివ్వడంతో ప్రస్తుతం కొన్ని తెరుచుకుంటున్నాయి. తగిన జాగ్రత్తలు పాటించకుండే వాటి నుంచీ ముప్పు విశాఖ ఘటనలా పొంచి వస్తుందని యాజమాన్యాలు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల జరిగిన ప్రమాదాలు..

జిల్లాలో ఈ వారంలో ఆర్సీపురం మండలంలోని ఓ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలి కెమిస్ట్ మృతి చెందాడు. అమీన్‌పూర్ మండలం గండిగూడెం శివారులోని రసాయనాల గోదాంలో జరిగిన ప్రమాదంతో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో సమీప ఐడీఏ బొల్లారంలోని కాలనీల వాసులు, గండిగూడెం ప్రాంతాల వారు రెండు గంటలపాటు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో కెమికల్ కంపెనీల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని లేనియెడల ప్రమాదాలు జరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఎందుకంటే గతంలో ఇటువంటి ఘటనలు జిల్లాలోనూ జరిగాయన్నారు. హత్నూర మండలంలోని తుర్కల ఖానాపూర్‌లో ఏడాది కిందట ఓ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకై గ్రామం అంతటా వ్యాపించింది. దాదాపు 2 గంటలపాటు సిబ్బంది శ్రమించి లీకేజీని నియంత్రించారు. అది ప్రమాదకర గ్యాస్ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అప్రమత్తమైన అధికారులు..

జిల్లాలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్న నేపథ్యలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. యాజమాన్యాలు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని పరిశ్రమలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే, అధికారులు మొక్కుబడిగా పరిశ్రమల యాజమాన్యాలకు సూచనలిస్తే సరిపోదనీ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు సేఫ్టీ కిట్‌లు ఉన్నాయా.? పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా.? ప్రమాదం జరిగితే నివారించే యంత్ర పరికరాలు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయి..? ప్రమాదాలను సూచించే అలరాం సిస్టం ఎన్ని కంపెనీల్లో పని చేస్తున్నాయన్నది అధికారులు చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. దాంతోపాటు కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed