గుట్టలను మింగుతున్న ఘనులు.. చోద్యం చూస్తున్న అధికారులు

by  |
chityala mud mafia news
X

దిశ,చిట్యాల: మట్టి మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే గుట్టలకు.. గుట్టలను మాయం చేస్తోంది. పగలు, అర్ధరాత్రి అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతుండటంతో నిన్న చూసిన గుట్ట నేటికి సారవంతమైన స్థలంగా మారుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని శాంతినగర్ గుట్టలు మాయమవుతుండగా.. గుంతలు పెట్టి మరీ మట్టిని మాయం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొంత డబ్బు ఉంటే చాలు దాన్ని నెలరోజుల్లో డబుల్‌ చేయాలి అంటే మట్టిని అమ్ముకుంటే చాలు అన్నచందంగా తయారైంది అంటే అతిశయోక్తి కాదు.

మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం..

మట్టి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుండటంతో ఆ వ్యాపారం వైపు ఇటీవల చాలా మంది మక్కువ చూపుతున్నారు. అయితే పగటి వేళ మట్టి కావాల్సిన వారి నుంచి ఆర్డర్లు తెచ్చుకోవటం.. అర్ధరాత్రి సమయాల్లో యంత్రాలు పెట్టి భారీ వాహనాలతో రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో శాంతినగర్ గ్రామ శివారులోని గుట్టలు మాయమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటంలేదనే ఆరోపణలున్నాయి. అధికారుల మామూళ్ల మత్తులో రూ.లక్షల మట్టి తరలుతున్నా పట్టించుకోవటంలేదని పలువురు అంటున్నారు. అనుమతులు తీసుకుంటే ఏం లాభం.. అర్ధరాత్రి దండుకుంటే చాలు అన్నచందంగా మట్టిమాఫియా రెచ్చిపోతోందని పలువురు అంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా రూ.లక్షల విలువైన మట్టిని తరలిస్తున్నారు.

పుల్లను కదిలించినా.. చట్టవిరుద్ధమే

గుట్టల్లో చిన్న పుల్లను కదిలించినా చట్ట ప్రకారం తప్పవుతుంది. కానీ ప్రస్తుతం ఈ చట్టం కేవలం చట్టుబండగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుట్టలు మాయం చేసే క్రమంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరుగుతున్నాయి. అటవీశాఖ చట్టప్రకారం దీనిని పెద్ద నేరంగా భావిస్తారు. కానీ మండలంలో ఎన్నో గుట్టలు మాయం అవుతున్నా, చెట్లు నేలకొరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవటంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు


Next Story