పుంజుకుంటున్న వాహనరంగం

by  |
పుంజుకుంటున్న వాహనరంగం
X

ముంబయి: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కోసం లాక్‌డౌన్ విధించారు. సుదీర్ఘంగా రెండు నెలలపాటు అన్ని ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా వాహనరంగం కుదేలైంది. ఉత్పత్తి, అమ్మకాలు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆంక్షలను సడలించారు. వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు చెప్పుకోతగిన స్థాయిలో క్రమేపీ పెరుగుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తక్కువే అయినా లాక్‌డౌన్ కాలంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తున్నది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(20201-21) జూలై‌ నెలకు సంబంధించి ప్యాసింజర్, త్రీవీలర్, టూవీలర్, లగ్జరీ వాహనాల అమ్మకాల గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(ఎస్‌ఐఏఎం) విడుదల చేసింది. గత నెలలో దేశవ్యాప్తంగా 1,82,779 ప్యాసింజర్ వాహనాలను విక్రయించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో 1,90,115గా ఉన్నాయి. జూలైలో 3.86శాతం అమ్మకాలు పడిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టూ వీలర్ వాహనాల అమ్మకాలు 12,81,354గా ఉండగా, 2019, జూలైలో 15,11,717గా ఉండటం గమనార్హం. టూ వీలర్ అమ్మకాలు దాదాపు 15.24శాతం పడిపోయినట్టు ఎస్ఐఏఎం తెలిపింది. జూలైలో టూవీలర్ అమ్మకాలతో పోలిస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. 2020, జూలైలో ప్యాసింజర్, త్రీవీలర్, టూవీలర్, లగ్జరీ వాహనాల ఉత్పత్తి 17,15,514గా ఉండగా, అంతకుముందు ఏడాది ఇదే నెలలో 24,28,518గా ఉన్నాయి. గత నెలలో ఉత్పత్తి గణనీయంగా 29.36శాతం పడిపోయినట్టు సీఐఏఎం పేర్కొంది.

2020, ఏప్రిల్-జూలై మధ్యకాలంలో ప్యాసింజర్ వాహనాల వార్షిక అమ్మకాలు 63శాతం క్షీణించి 3,36,513 యూనిట్లుగా ఉండగా, టూవీలర్ అమ్మకాలు 60.54శాతం పడిపోయి 25,74,67 యూనిట్లుగా ఉన్నదని సీఐఏఎం తెలిపింది. ఇదే కాలంలో ప్యాసింజర్, త్రీవీలర్, టూవీలర్, క్వార్డీరిసైకిల్ వాహనాల ఉత్పత్తి 66శాతం క్షీణించి 31,73,169గా ఉంది.

కరోనా వ్యాప్తి తర్వాత నెలలతో పోలిస్తే జూలై అమ్మకాలు కొంత మెరుగ్గా ఉన్నాయని, ఇది వాహన పరిశ్రమకు ధైర్యాన్ని ఇస్తాయని సీఐఏఎం డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు సెంటిమెంట్‌ను బలపరిచి వాహనరంగం పునరుజ్జీవనానికి తోడ్పుతాయన్నారు. అయితే, ఆగస్టు నెలో అమ్మకాలు ప్రస్తుత డిమాండ్ స్థిరమైందా లేక కాకతాళీయమైనదా అనే విషయం స్పష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed