కాంపొనెంట్ పరికరాల కొరతతో 2 శాతం క్షీణించిన స్మార్ట్‌ఫోన్ల రవాణా!

by  |
కాంపొనెంట్ పరికరాల కొరతతో 2 శాతం క్షీణించిన స్మార్ట్‌ఫోన్ల రవాణా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కాంపొనెంట్ పరికరాల కొరత కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల రవాణా 2 శాతం క్షీణించి 5.2 కోట్ల యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో కోవిడ్ మహమ్మారి కారణంగా అధిక డిమాండ్ ఏర్పడింది. దీంతో రికార్డు స్థాయిలో రవాణ జరిగిందని ప్రముఖ పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక వెల్లడించింది. అధిక డిమాండ్ కారణంగా వినియోగదారులకు అవసరమైన స్థాయిలో సరఫరా జరగలేదని, అంతర్జాతీయంగా కాంపొనెంట్ కొరతను దృష్టిలో ఉంచుకుని చాలావరకు బ్రాండ్ కంపెనీలు పండుగ సీజన్ కోసం తగినంత మాత్రమే స్టాక్‌ను భద్రపరిచాయి.

ఇదే సమయంలో ఆన్‌లైన్ అమ్మకాలకు సంబంధించి డిమాండ్ స్థిరంగా ఉందని, ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అత్యధికంగా స్మార్ట్‌ఫోన్ల రవాణా నమోదైందని’ కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రచీర్ సింగ్ అన్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సెప్టెంబర్ త్రైమాసికంలో 55 శాతం నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్లు 74 శాతం వాటాను సొంతం చేసుకున్నాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో 22 శాతం వాటాతో షియోమీ, శాంసంగ్ 19 శాతం, వీవో 15 శాతం, రియల్‌మీ 14 శాతం, ఒప్పో 10 శాతంతో కొనసాగుతున్నాయి. సమీక్షించిన త్రైమాసికంలో యాపిల్ సంస్థ 212 శాతం వృద్ధి సాధించి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 44 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది.



Next Story

Most Viewed