మిడ్-రేంజ్ సెడాన్ 'స్లావియా'ను లాంచ్ చేసిన స్కోడా!

by  |
మిడ్-రేంజ్ సెడాన్ స్లావియాను లాంచ్ చేసిన స్కోడా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా గురువారం భారత మార్కెట్లో తన సెడాన్ మోడల్ స్లావియాను లాంచ్ చేసింది. కంపెనీ నిర్దేశించిన ‘స్ట్రాటజీ 2030’లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 15 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించాలనే లక్ష్యానికి ఈ మోడల్ దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఇండియా 2.0 ప్రాకెజ్ట్ కింద ‘స్లావియా’ మోడల్‌ను రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. 2022, మొదటి త్రైమాసికం నుంచి డెలివరీలను అందజేయనున్నట్టు పేర్కొంది.

ప్రస్తుతం దేశీయంగా మిడ్-రేంజ్ సెడాన్ హోండా సిటీ, హ్యూండాయ్ వెర్నా, మారుతీ సుజుకి సియజ్‌లకు స్లావియా పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ ఆటో మార్కెట్లో 2025 నాటికి 5 శాతం మార్కెట్ వాటాను అందుకునేందుకు స్లావియా మోడల్ దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది. నెలకు 2,500-3000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. సరికొత్త సెడాన్ స్లావియా మోడల్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుందని, ఆరు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ తెలిపింది.

ప్రత్యేకంగా దేశీయ వినియోగదారుల కోసం ఈ మోడల్‌ను రూపొందించినట్టు, ప్రస్తుతం ఉన్న అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును విడుదల చేస్తున్నామని స్కోడా ఆటో సీఈఓ థామస్ స్కాఫెర్ అన్నారు. స్కోడా స్లావియా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుందని, 6-స్పీడ్ మాన్యూవల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మెషిన్ ఆప్షన్లలో లభిస్తుంది.


Next Story

Most Viewed