ముద్ర మొదటికే మోసం చేసింది !

by  |
ముద్ర మొదటికే మోసం చేసింది !
X

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశీ ప్రయాణీకులకు ముంజేతిపై విమానాశ్రయాల్లో వేసే ముద్ర మొదటికే మోసం తెచ్చింది. విదేశీ ప్రయాణాన్ని ముగించుకుని వచ్చిన మాజీ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీకి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంజేతికి ముద్ర వేశారు. రసాయనాలతో కూడిన ఇంకు కావడంతో చర్మానికి రియాక్షన్ వచ్చింది. ఇంకు ముద్ర ఉన్న ప్రాంతమంతా కాలిన గాయంలాగా మారిపోయింది. ఇదే విషయాన్ని ఢిల్లీ విమానాశ్రయ వర్గాల దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే జీఎంఆర్ నిర్వాహకులు ఆ బ్యాచ్ ఇంకును వినియోగించకుండా పక్కన పెడుతున్నామని, దాని తయారీదారులకు నోటీసు జారీ చేశామని, విచారణ జరుపుతామని మధు యాష్కీకి ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సైతం జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైపర్ సెన్సిటివిటీ అలెర్జీ రియాక్షన్ అయి ఉండొచ్చని స్కిన్ డాక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేసిన మధు యాష్కీకి అభిమానుల నుంచి పరామర్శలు వెల్లువెత్తాయి. గతంలో సైతం కొద్దిమందికి ఇలాంటి ముద్రలు వేయడం ద్వారా స్కిన్ ఎలర్జీ వచ్చిందని, బానిస వ్యవస్థలో ఇలాంటి ముద్రల సంప్రదాయం ఉండేదని, ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో క్వారంటైన్ కోసం ఇలాంటి ముద్రలు వేస్తున్నారని ఒకరు ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed