డిశ్చార్జైన శిరీష.. ఆసుపత్రి వేధింపులు బయటపెట్టిన తల్లి

by  |
Sirisha, discharged
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: హస్తినాపురంలో గతవారం రోజుల క్రితం ప్రేమోన్మాది బసవరాజు క‌త్తిపోట్ల దాడిలో గాయపడిన దౌల్తాబాద్ మండలానికి చెందిన శిరీష హస్తినాపురంలోని నవీనా ఆసుపత్రిలో చికిత్స పొంది గురువారం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా నవీనా ఆసుపత్రి యజమాన్యం సుభాన్ రెడ్డి నేతృత్వంలో మేనేజింగ్ డైరెక్టర్ రాజవర్ధన్ రెడ్డి, రఘుపతి రెడ్డిలు డాక్టర్‌లతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్లు రణధీర్ రెడ్డి, రవితేజ, డాక్టర్ శ్రీనునాయక్‌లు మాట్లాడుతూ.. శీరిషకు 18 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని, ఆసుపత్రిలో చేరినప్పుడు తీవ్ర రక్తస్రావం కావడంతో రెండ్రోజులు తన పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందించామని తెలిపారు.

ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా పూర్తిస్థాయిలో ఆరోగ్యం కోలుకునే విధంగా వైద్యాన్ని అందించామని వివ‌రించారు. ఇదిలా ఉండగా, డాక్టర్లు మాట్లాడిన అనంతరం బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తమ కూతురు జీవితమే ఆగమై పోయిందని, దీనికి తోడు ఆసుపత్రి యాజమాన్యం డబ్బులు విపరీతంగా వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మూడు లక్షలకు పైగా డబ్బులు చెల్లించినా, మరో లక్ష కట్టకపోతే డిశ్చార్జీ చేయబోమని వైద్యులు అన్నారని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయని, తన బిడ్డకు అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నానని ఆమె బోరున విల‌పించింది. అయితే ఆ విషయాలు ఏవీ చెప్పొద్దంటూ వైద్యులు హెచ్చరించే ప్రయత్నం చేశారు. వైద్యం ఎలా జరిగింది అనేది మాత్రమే చెప్పాలి కానీ, డబ్బుల విషయం ఇక్కడ చెప్పొద్దు అంటూ అడ్డుప‌డ్డారు.

Next Story