సింగరేణి జేఏసీ ప్లాన్.. త్వరలో..

by  |
సింగరేణి జేఏసీ ప్లాన్.. త్వరలో..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల్లో మరో సమ్మెకు కార్మికులు సమాయత్తం అవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా సింగరేణి ఐక్య కార్మిక సంఘాలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీలో జూలై 2న జరిగిన 72 గంటల దేశవ్యాప్త సమ్మె సక్సెస్ కావడంతో ఐక్య కార్మిక సంఘంలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఐక్య కార్మిక సంఘాలు వ్యూహాత్మకంగా జూలై 2 నుంచి జరిగిన 72 గంటల సమ్మె సక్సెస్ కావడంతో మరో అడుగు ముందుకేసి దీర్ఘకాలిక సమ్మె చేయాలని సమాలోచనలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సింగరేణి ఐక్య కార్మిక సంఘాల్లో ఒకటైన హెచ్‌ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ పరోక్షంగా సమ్మె సంకేతాలు ఇవ్వడం గమనార్హం. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని దేశవ్యాప్త సమ్మె చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని విలేకరుల ఎదుట స్పష్టం చేశారు. అందుకే ఐక్య కార్మిక సంఘాలు సింగరేణి లో ఉన్న 27 భూగర్భ గనుల్లో, 18 ఓపెన్ కాస్టు గనుల్లో కార్మికులను సమాయత్తం చేసేందుకు సన్నద్దులవుతున్నారని ప్రచారం జరుగుతున్నది.మొన్నటి 72 గంటల సమ్మె విజయవంతం చేయడంతో ఐక్య కార్మిక సంఘాలు మరో దీర్ఘకాలిక సమ్మె చేసేందుకు సన్నద్ధం అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో మరోమారు సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి.

ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా..
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగియడంతో కార్మిక సంఘాల ఎన్నికలతో పాటు..కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక సమ్మె చేసేందుకు జేఏసీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. దీర్ఘకాలిక సమ్మె చేసేందుకు ఐక్య కార్మిక సంఘాలు లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. సింగరేణి కంపెనీలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ,హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, ఐఎన్‌టీసీ కార్మిక సంఘాలు కూటమిగా ఏర్పడి దీర్ఘకాలిక సమ్మె చేసేందుకు సమాలోచనలు జరుపుతునట్టు సమాచారం. దీంతో మరోమారు సింగరేణిలో సమ్మె మేఘాలు అలుముకునేలా కనిపిస్తున్నాయి.


Next Story

Most Viewed