ఎలక్ట్రిక్ కార్లకు సై అంటున్న సింపుల్ ఎనర్జీ కంపెనీ

by  |
cars-enargy
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అనూహ్యంగా దూసుకొచ్చిన సంస్థ సింపుల్ ఎనర్జీ. తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఓలా ఎలక్ట్రిక్ తర్వాత రికార్డు స్థాయిలో బుకింగ్స్ సాధించి దేశీయ మార్కెట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సంస్థ కార్ల తయారీని కూడా త్వరలో ప్రారంభించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న 18 నెలల కాలంలో న్యూ పవర్ ట్రైన్‌ను ఆవిష్కరిస్తామని, ఆటో పరిశ్రమలోని భిన్న విభాగాల్లో ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్టు సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్‌కుమారు చెప్పారు. అన్ని విభాగాల్లో పట్టు సాధించేందుకు పరిశోధనా, అభివృద్ధి బృందాన్ని పెంచుతున్నామని ఆయన తెలిపారు.

ఈ నెలలోనే సింపుల్ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీనికోసం కంపెనీ సొంతంగానే బ్యాటరీ, మోటార్లను అభివృద్ధి చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని ఈ-స్కూటర్లను తీసుకొస్తామని, ఆ తర్వాత కారును కూడా తయారు చేయనున్నట్టు రాజ్‌కుమార్ వివరించారు. కాగా, సంస్థ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మరో సంవత్సరన్నర కాలంలో దేశంలోని మొత్తం 13 రాష్ట్రాల్లో వెయ్యి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం 3-7 నెలల కాలంలో 300కు పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, వాహనాలను దేశీయంగానే కాకుండా ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. దీని ద్వారా ఏడాదిలో 30-40 వేల వాహనాలను విక్రయించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.



Next Story