చిరు వ్యాపారులపై మున్సిపల్ సిబ్బంది దౌర్జన్యం..

by  |
చిరు వ్యాపారులపై మున్సిపల్ సిబ్బంది దౌర్జన్యం..
X

దిశ, సిద్దిపేట: చిరు కూరగాయల వ్యాపారులపై సిద్దిపేట మున్సిపల్ సిబ్బంది దౌర్జన్యం సృష్టించారు. మల్లన్న సాగర్‌లో సర్వం కోల్పోయి జీవనోపాధి కోసం సిద్దిపేట హై స్కూల్ దగ్గర గల ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్ముకుంటున్నారు. అయితే ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్మ వద్దని మున్సిపల్ సిబ్బంది కూరగాయలను చెత్త సేకరణ బండిలో తరలించారు. దీంతో ఆగ్రహించిన చిరు వ్యాపారులు కొంతసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమకు ఒక గంట టైం ఇవ్వండి మేమే ఖాళీ చేస్తామని చెప్పినా వినకుండా.. తినే కూరగాయలను, ఆకుకూరలను చెత్త బండిలో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఊర్లు, పంట పొలాలు ప్రాజెక్టు లో మునిగిపోవడంతో బతుకు భారమై సిద్దిపేట లో కూరగాయలు అమ్ముకొని బతుకునీడుస్తున్నామన్నారు.

ఇప్పటికే అంతా కోల్పోయి దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్న మాపై మున్సిపల్ అధికారులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అయితే ఫుట్‌పాత్ పై ఎలాంటి వ్యాపారాలు చేయకూడదనే నిబంధన ఉందని మున్సిపల్ సిబ్బంది అంతా మూకుమ్మడిగా దాడి చేసి కూరగాయ లన్నింటిని చెత్త బండి లో వేసి తరలించారు. తన కూరగాయలను వేరొక చోటికి తీసుకు వెళతానని దయచేసి అవకాశం ఇవ్వండని ఓ మహిళ ఎంత ప్రాధేయపడినా వినకుండా తాజా కూరగాయలను చెత్త బండిలో వేయడం పలువురిని కలచివేసింది. సిద్దిపేట పట్టణంలో ఫుట్ పాత్‌పై ఈ ఒక్క చోటే వ్యాపారాలు కొనసాగుతున్నాయా అని వారు ప్రశ్నించారు.

సుభాష్ రోడ్‌లో తోపుడు బండ్లు పెట్టి ట్రాఫిక్ కి ప్రతిరోజు అంతరాయం కలిగిస్తున్న వారిపై ఈ విధంగా కఠిన చర్యలకు మున్సిపల్ సిబ్బంది ఎందుకు పూనుకోవడం లేదని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణమంతా లేనిది ఈ ఒక్క చోటే ఫుట్ పాత్ ను ఖాళీ చేయించడంలో మున్సిపల్ అధికారుల ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కూరగాయలను చెత్త బండి లో వేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Next Story

Most Viewed