మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చిన సొంత నియోజకవర్గ ప్రజలు

by  |
Arrest
X

దిశ, జవహర్ నగర్: తన నోటి దూరుసు మాటలు మంత్రి మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారాన్ని లేపగా.. తాజాగా జవహర్ నగర్ పరిధిలోని అంబేడ్కర్ నగర వాసులపై చేసిన కామెంట్స్ ఆయనను ఇరకాటంలో పడేశాయి. దీంతో ఆ ప్రాంత వాసులు, బీజేపీ, కాంగ్రెస్, జేఏసీ నేతలు ఆదివారం ఆందోళనకు దిగారు. మంత్రి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన ప్రధాన రహదారి నుంచి కాకుండా దొడ్డి దారిన వెళ్లి ప్రారంభోత్సవాలు చేశారు. ఇంతకూ మంత్రి ఏం మాట్లాడారంటే..

గత ఆదివారం అంబేడ్కర్ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘‘డంపింగ్ యార్డ్ వాసన దమ్మాయిగూడ దిక్కు పోతుంది. జవహర్ నగర్ దిక్కు వాసన లేదు. మీరే అదృష్టమంతులు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. తనల్ని కించపరిచేలా మాట్లాడారని, వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్, జేఏసీ నేతలు మద్దతు పలికారు. కాగా, ఆదివారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని శశాంక్ ఎన్ క్లేవ్‌లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రిని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు దమ్మాయిగూడ చౌరస్తాలో మోహరించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి దమ్మాయిగూడ చౌరస్తా మీదుగా కాకుండా నాగారం చౌరస్తా మీదుగా కృష్ణ థియేటర్ సమీపంలో సీసీ కెమెరాలను ప్రారంభించి వెళ్లిపోయారు. అప్పటికే చౌరస్తాలో వేచి ఉన్న ఆందోళనకారులు కృష్ణ థియేటర్ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు సంజీవరెడ్డి, సామల శ్రీనివాస్ రెడ్డి, ముప్ప రామారావు, బీజేపీ నాయకులు గాలి సంపత్ యాదవ్ ఉన్నారు.

అరెస్టులను ఖండిస్తూ నిరసన

ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేయడం, మంత్రి వైఖరిని నిరసిస్తూ దమ్మాయిగూడ చౌరస్తాలో బీజేపీ, కాంగ్రెస్, జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. మంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం నేరమా అని ప్రశ్నించారు. అరాచక పాలకులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రిని నిలదీస్తే అక్రమ అరెస్టులు చేయడం తగదని, అరెస్టు చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, లేదంటే ప్రజా ఉద్యమానికి గురికాక తప్పదని జాక్ కో కన్వీనర్ కేతేపల్లి పద్మాచారి, నాయకులు హెచ్చరించారు. ఈ నిరసనలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోరనాగ మల్లారెడ్డి, వి.శాంతి రెడ్డి, దోంకెన రవీందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, సునీల్ చారి, సాహితీ సుజాత, శోభా, మధుసూదన్, బలరాం సింగ్, దమ్మాయిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు రామారావు, సామల శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు సంజీవ రెడ్డి, జాక్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed