మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్?

by  |
మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్?
X

భోపాల్: రెండువారాల పాటు అనిశ్చితిలో సాగిన మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం.. శుక్రవారం ఓ కొలిక్కి వచ్చింది. ఫ్లోర్ టెస్ట్‌ నిర్వహించాలని గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు ఆదేశించినప్పటి నుంచి పరిణామాలు వేగంగా మారాయి. కమల్‌నాథ్ సర్కారు దిగిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చే మార్గాలు శుక్రవారంనాడు సుగమమయ్యాయి. మధ్యప్రదేశ్‌కు మూడు సార్లు సీఎంగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు కేంద్రంలోని నాయకత్వం అంగీకరించినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి.

బల పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన రోజు రాత్రే మిగతా 16 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి ఆమోదించారు. అంతకు క్రితం ఆరుగురు మంత్రుల రాజీనామాలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో కమల్‌నాథ్ కోటకు గండిపడిందని దాదాపు అందరూ అంచనాకు వచ్చారు. కానీ, ఫ్లోర్ టెస్ట్‌లో తామే నెగ్గుతామని ఇరుపార్టీలు వాదించాయి. సీఎం దగ్గర ఫార్ములా 5(కాంగ్రెస్, ఇతరుల మద్దతుతో 99 మంది సంఖ్యా బలమున్న కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమొచ్చింది. ఆ ఐదుగురి వివరాలను సీఎం వెల్లడిస్తారని కాంగ్రెస్ నేతలు బుకాయిస్తూ వచ్చారు) ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు.

కానీ, ఫ్లోర్ టెస్ట్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కమల్‌నాథ్.. ఊహించినట్టుగానే రాజీనామా ప్రకటించారు. అనంతరం గవర్నర్ లాల్‌జీ టాండన్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. దీంతో అధికారపీఠాన్ని అధిరోహించేందుకు బీజేపీకి దారులు తెరుచుకున్నాయి. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు హర్షాతిరేకాలను ప్రకటించారు. అనంతరం భోపాల్‌లోని బీజేపీ కార్యాలయానికి చేరుకుని శివరాజ్ సింగ్ చౌహాన్.. తన సహచర ఎమ్మెల్యేలతో సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు తినిపించుకున్నారు.

ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యేలు శాసన సభ పక్షనేతను ఎన్నుకోబోతున్నట్టు తెలిసింది. అనంతరం గవర్నర్ లాల్‌జీ టాండన్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని బీజేపీ నేతలు కోరనున్నారు.

tags : madhya pradesh, political crisis, topple, bjp govt, shivraj singh chauhan, MP CM

Next Story