70 ఏండ్ల భూమి పంచాయితీ.. ఇకనైనా తేలేనా!

by  |
70 ఏండ్ల భూమి పంచాయితీ.. ఇకనైనా తేలేనా!
X

దిశ, నల్లగొండ: గత 70ఏండ్లుగా మా తాతల కాలం నుంచి కబ్జాలో ఉన్న భూములను దౌర్జన్యంగా గుంజుకున్నారనీ, రెవెన్యూ అధికారులు కూడా వారికే వంతపాడుతున్నారని బట్టుగూడెంకు చెందిన గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం 10 కుటుంబాలకు చెందిన 30 మంది బాధితులు జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ..గత70 ఏండ్లుగా కబ్జాలో ఉన్న లిటిగేషన్‌ భూమిని ఇంతకు ముందు విధుల్లో ఉన్న తహశీల్దారు తన సమీప బంధువుకు బీబీనగర్ మండలం బట్టుగూడెం వద్ద గల 128 సర్వేనెంబర్‌లోని 8 ఎకరాల 19 గుంటల భూమిని దొడ్డి దారిన కట్టబెట్టి ఓఆర్సీ పట్టా ఇప్పించాడు. దీనికి వ్యతిరేకంగా పోరాడిన బాధితులపై కొందరు దౌర్జన్యానికి కూడా దిగారని వివరించారు. ఆ భూమికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టి, పేదలైన గొర్రెలకాపరులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు డబ్బు, పలుకుబడి ఉన్నవారికే అన్ని సహకారాలు అందిస్తున్నారని, న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల మెట్లు ఎక్కిన వారికి అన్యాయమే జరుగుతోందని మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. నిరసన అనంతరం బాధితులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ రమేష్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు గంగదేవి జంగయ్య, ఎల్లాముల సత్యనారాయణ, బాధితులు ముక్కెర్ల పురుషోత్తం, రాములు, నర్సింహులు, మల్లేష్ , వెంకటేశ్వర్లు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed