హైదరాబాద్ సేఫ్ సిటీ.. సీపీ అంజనీకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
CP-Anjani-Kumar
X

దిశ, చార్మినార్: బాలికలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘షీ టీమ్స్‌’ విభాగం విజయవంతంగా ఏడేండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని చేలాపురా పోలీస్ క్యాంపు కార్యాలయంలో శనివారం ‘షీ టీమ్స్’ 7వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్, అడిషనల్ సీపీ(క్రైమ్స్) షికా గోయల్, షీ టీమ్స్ ఇంచార్జ్, అడిషనల్ డీసీపీ శిరీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ… ఏడేళ్లలో షీ టీమ్స్ ఎన్నో కేసులు పరిష్కరించి, అద్భుతమైన ఫలితాలు సాధించిందని తెలిపారు. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా సమస్య వస్తే.. ఫిర్యాదు చేయడానికి ఇక సైఫాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని, చేలాపురాలోని పోలీస్ క్యాంపు కార్యాలయంలో ప్రతీ బుధవారం నాలుగు గంటలపాటు షీ టీమ్స్ ఇంచార్జ్ శిరీషా క్యాంపు నిర్వహిస్తారని సూచించారు.

షీ టీమ్స్​7వ వార్షికోత్సవం చారిత్రాత్మక రోజని, గడిచిన ఏడేళ్లలోనే దేశంలో ‘హైదరాబాద్​షీ టీమ్స్’​కు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని అన్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో స్టేట్మెంట్ ప్రకారం.. దేశంలో హైదరాబాద్​అత్యంత సురక్షితమైన సిటీగా గుర్తింపు పొందిందన్నారు. దేశంలో ఇతర ముంబాయి, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నగరాలతో పోల్చి చూస్తే మహిళలపై క్రైం రేట్ హైదరాబాద్‌లోనే చాలా తక్కువగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాములు నాయక్, సయ్యద్ రఫిక్, చార్మినార్ ఏసీపీ భిక్షంరెడ్డి, ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌ పెక్టర్ పి.జానకమ్మ పాల్గొన్నారు.


Next Story

Most Viewed