షర్మిల అనుచరులకు కరోనా

by  |
షర్మిల అనుచరులకు కరోనా
X

దిశ‌, తెలంగాణ బ్యూరో: ష‌ర్మిల చేప‌డుతున్న ఉద్యోగ దీక్ష లోట‌స్ పాండ్‌లో రెండో రోజు కొన‌సాగుతోంది. ఈ దీక్షలో పాల్గొన్న ష‌ర్మిల చేతికి క‌ట్టుతో క‌నిపించారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద దీక్ష అనంతరం పాద‌యాత్రగా లోట‌స్ పాండ్‌కు వ‌స్తున్న ష‌ర్మిల‌ను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసే క్రమంలో తోపులాట జరిగి షర్మిల చేతికి గాయమైంది. దీంతో వైద్యులు ఆమె చేతికి కట్టు కట్టారు. ఇదిలా ఉండగా షర్మిల ఆరోగ్య స్థితిని వైద్యుడు చంద్రశేఖర్ రెడ్డి పరీక్షించాడు. పల్స్ డౌన్ కావడంతో ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యుడు సూచించగా షర్మిల నిరాకరించారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా 72 గంటల పాటు దీక్ష కొనసాగిస్తానన్న షర్మిల ఆదివారం ఉదయం 11 గంటలకు విరమించే అవకాశాలు ఉన్నాయి.

ఏసీపీ తీరుపై న‌ల్ల బ్యాడ్జీలతో నిర‌స‌న‌

పోలీసులు దాడికి నిర‌స‌న‌గా షర్మిల, ఆమె అనుచ‌రులు న‌ల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏసీపీ శ్రీధర్ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపులాట సమయంలో దూషించారని, అలాగే దీక్ష చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లిపోండని హెచ్చరించినట్లు షర్మిల అనుచరులు తెలిపారు. ఈ విషయమై ఏసీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు షర్మిల అనుచరులు ఇందిరా శోభన్, పిట్టా రాంరెడ్డి వెళ్లారు. అయితే డీజీపీ కార్యాలయంలోనే ఉన్నా కలిసేందుకు సమయం కేటాయించకపోవడంతో సిబ్బందికే ఫిర్యాదు పత్రాన్ని ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో సమస్యలపై పోరాడే హక్కు అందరికీ ఉందని వారు తెలిపారు.

ఇటీవల ఖమ్మం జిల్లాలో షర్మిల నిర్వహించిన సంకల్ప సభకు వెళ్లి వచ్చిన పలువురు నాయకులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. షర్మిల ముఖ్య అనుచరుడు కొండ రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. సంగారెడ్డి ఇన్ చార్జి శ్రీధర్ రెడ్డితో పాటు ఒకరిద్దరు నాయకులు ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు నాయకులు కూడా హోం క్వారంటైన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇందిరాపార్క్ వద్ద దీక్షలో షర్మిల కూడా మాస్క్ లేకుండానే పాల్గొనడం చర్చనీయాంశమైంది.


Next Story

Most Viewed