కేసులు పెరుగుతున్నాయి.. రెడీగా మరో ఏడు వ్యాక్సిన్లు

by  |
కేసులు పెరుగుతున్నాయి.. రెడీగా మరో ఏడు వ్యాక్సిన్లు
X

న్యూఢిల్లీ: దేశంలో మరో ఏడు కరోనా వ్యాక్సిన్‌లు ప్రయోగాల దశలో ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆయన భార్యతో కలిసి కొవిడ్ రెండో డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రస్తుతం మరో ఏడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉండగా.. ఇందులో పలు వ్యాక్సిన్లు అడ్వాన్స్‌డ్ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని తెలిపారు. దేశంలో ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించిన కోవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలను అత్యవసర వినియోగం కింద వాడుతున్న విషయం తెలిసిందే.

ఈ వ్యాక్సిన్‌లపై ప్రజల్లో సందేహాలు నెలకొన్న నేపథ్యంలో హర్షవర్ధన్ స్పందించారు. ఇండియా వ్యాక్సిన్లు రెండూ సురక్షితమైనవే కాకుండా సమర్థవంతమైనవని అన్నారు. వాటి సామర్థ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగం పుంజుకుంటున్నది. దేశంలో ఇప్పటిదాకా 6 కోట్ల 11 లక్షల మంది (6,11,13,354)కి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 5 కోట్ల 22 లక్షల మందికి తొలి డోసు వేయగా.. 89 లక్షల మందికి రెండో డోసు తీసుకున్నారు.

Next Story