ఈనెల 8 నుంచి పార్లమెంటు సమావేశాలు..

by  |
Parliament
X

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు 8వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. కానీ, ఐదు అసెంబ్లీల ఎన్నికలు ఈ నెల 27న ప్రారంభం కానుండటంతో రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎలక్షన్స్‌పైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన సందడి పెద్దగా కనిపించడం లేదు.

కరోనా కారణంగా పార్లమెంటు ఆవరణలోకి వెళ్లే ఎంపీలు, జర్నలిస్టులు, ఇతరులు అందరికీ వైరస్ టెస్టులు చేసుకున్నాకే అనుమతినిచ్చారు. రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన సందర్భంగా చట్టసభ్యులకు టీకా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారా? అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను అడగ్గా లేదని సమాధానమిచ్చారు. టీకా వేయాల్సిన ప్రాధాన్యత వర్గాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగానే తామూ నడుచుకుంటామని వివరించారు. టీకా వేసుకోవడం స్వచ్ఛందమే కావడంతో అది ఎంపీలు, జర్నలిస్టులు స్వీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. కానీ, కరోనా టెస్టులు మాత్రం తప్పనిసరిగా అమలు చేయనున్నదని తెలుస్తున్నది.

సాధారణంగా బడ్జెట్ సమావేశాలు రెండు దఫాలుగా నిర్వహిస్తారు. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 13వరకు సాగాయి. సంవత్సరంలో తొలి సమావేశం కావడంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 13న సమావేశాలు వాయిదా పడ్డాయి. రెండో విడత ఈ నెల 8 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ విరామకాలంలో పలు మంత్రిత్వ శాఖలు డిమాండ్ చేసిన గ్రాంట్లు, ఫైనాన్స్ బిల్లు సంబంధ గ్రాంట్లను స్టాండింగ్ కమిటీలు పరీక్షిస్తాయి. రెండో విడత సమావేశాల్లో వీటిని ఆమోదిస్తాయి.


Next Story