పదిన్నరేళ్ల గరిష్ఠాలకు దేశీయ సేవల రంగ కార్యకలాపాలు!

by  |
పదిన్నరేళ్ల గరిష్ఠాలకు దేశీయ సేవల రంగ కార్యకలాపాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని సేవల రంగ కార్యకలాపాలు భారీగా పుంజుకున్నాయి. ముడి పదార్థాల కారణంగా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచినప్పటికీ సేవల రంగ కార్యకాలాపాలు ఈ ఏడాది అక్టోబర్‌లో పదిన్నర ఏళ్ల(10.5 ఏళ్లు) గరిష్ఠాలకు చేరుకున్నట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ పర్చేజింగ్ మనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) సూచించింది. ఉత్పత్తిలో క్షీణత, ఉపాధి కల్పన రేటు నిరాశజనకంగా ఉన్నప్పటికీ సేవల రంగం ఎక్కువ నియామకాలు నమోదవడం గమనార్హం.

సమీక్షించిన నెలలో సేవల రంగం పీఎంఐ 58.4 గా నమోదు కాగా అంతకుముందు నెలలో ఇది 55.2గా ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ తెలిపింది. సాధారణంగా పీఎంఐ సూచీ 50కి పైన నమోదైతే సానుకూల వృద్ధిగానూ, 50కి దిగువన ఉంటే క్షీణతగానూ భావిస్తారు. డిమాండ్ మెరుగ్గా ఉండటంతో అమ్మకాలతో పాటు ఉత్పత్తిని కూడా పెంచాయి. కొత్త ఆర్డర్లు గణనీయంగా 2011, జులై తర్వాత అత్యంత వేగంతంగా పెరగడమే దీనికి కారణం.

ఇక ముడి పదార్థాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఇంధనం, మెటీరియల్, సిబ్బంది, రవాణా కోసం చేసే ఖర్చులు 4 ఏళ్ల గరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో నియామకాలను పెంచక తప్పలేదు. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో భారత సేవలకు గిరాకీ తగ్గడంతో ఎగుమతులు క్షీణించాయి. కానీ ప్రైవేట్ సేవల రంగం మాత్రం అక్టోబర్‌లో పెరిగింది. కంపెనీలు తమ సేవల ఛార్జీలను ఎక్కువగా వసూలు చేసినప్పటికీ కొత్త ఆర్డర్లను కూడా అదేస్థాయిలో అందుకోగలిగాయి.


Next Story

Most Viewed