టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు

by  |
టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు
X

ముంబయి: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా దిగ్గజం ఆస్ట్రా జెనెకాలు సంయుక్తంగా కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ టీకాను భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతించాలని రెండు వారాల్లో రెగ్యులేటరీకి దరఖాస్తు చేయనున్నట్టు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రా జెనెకాలతో సీరం భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కొవిషీల్డ్ పేరిట ఆ టీకా ట్రయల్స్ నిర్వహిస్తున్నది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. తుది దశ ట్రయల్స్ పూర్తికాకముందే తొలి దశ ప్రయోగాల్లో టీకా సమర్థత వెల్లడయ్యాక అత్యవసర పరిస్థితులు దృష్ట్యా ముందస్తుగానే వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ యూజ్ కింద అందించవచ్చు.

సీరం ప్లాంట్‌ను పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీతో భేటీ అయిన తర్వాత సీఈవో అదర్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ, రెండు వారాల్లో అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన ట్రయల్స్ వెల్లడించిన టీకా ప్రదర్శించిన సామర్థ్యం దరఖాస్తుకు సరిపోతుందని వివరించారు. మైనర్లపై టీకా ట్రయల్స్‌పై త్వరలో ప్రణాళికలు వేస్తామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వంతో టీకా కొనగోలుపై స్పష్టమైన డీల్ ఏమీ కుదరలేదని, కానీ, వచ్చే ఏడాది జులైలోపు 30 నుంచి 40 కోట్ల డోసులు తమ దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశమున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు ఐదు నుంచి ఆరు కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నారని, జనవరి తర్వాత ఈ సంఖ్య పదికోట్లకు చేరుతుందని వివరించారు.


Next Story