కేంద్రానికో రేటు.. మాకో రేటా..?

by  |
కేంద్రానికో రేటు.. మాకో రేటా..?
X

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను తయారుచేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ ధరల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ‘కేంద్ర ప్రభుత్వానికి ఒక రేటు.. మాకు ఒక రేటా..?’ అని విమర్శలు కురిపిస్తున్నాయి. కో ఆపరేటివ్ ఫెడరలిజం అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. చెప్తున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండినవారికి టీకాలు అందించాలని, అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ కంపెనీలు తమ ఉత్పత్తిలో 50 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ ధరను రాష్ట్ర ప్రభుత్వాలకు (ఒక్క డోసుకు) రూ. 400, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 600 గా నిర్ణయించగా.. కేంద్ర ప్రభుత్వానికి రూ. 150 కే విక్రయించనున్నట్టు ప్రకటించింది.

ఇప్పుడు ఇదే విషయమై రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా సీరం ధరలు నిర్ణయించలేదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా..? అని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఒక రాష్ట్రానికి చెందిన ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుడు స్పందిస్తూ.. ‘ఇది తెలివితక్కువ పని. ఏమి జరుగుతుందో నాకు తెలియదు. కానీ దీనిని ఏ విధంగా వివరించాలో కూడా నాకు అర్థం కావడం లేదు..’ అని వ్యాఖ్యానించారు. మరో రాష్ట్రానికి చెందిన నాయకుడు స్పందిస్తూ.. ‘కేంద్ర చెబుతున్న కో ఆపరేటివ్ ఫెడరలిజానికి.. చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదు’ అని వాపోయారు. అంతేగాక ధరల నిర్ణయానికి ఏ ప్రామాణికతను ఉపయోగించారని పలు రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 600 ధర నిర్ణయించిన సీరం.. మెట్రో సిటీస్‌లో సకల సౌకర్యాలు ఉన్న కార్పొరేట్ హాస్పిటళ్లకు, సాధారణ టౌన్ లో ఉన్న నర్సింగ్ హోం వంటి దానికి ఒకే ధరను ఎలా నిర్ణయించిందని అడుగుతున్నాయి. ధరల వివక్షపై కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ పాలిత రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ‘ధరలను పంపిణీదారుకు వదిలేసినా.. పంపిణీ మాత్రం న్యాయంగా జరగాలని’ ఆ అధికారి తెలిపారు.

Next Story