ఈ నెలాఖరు వరకూ ఉద్యోగుల విభజన.. ఆ నాలుగు శాఖలపైనే సాగదీత

by  |
ఈ నెలాఖరు వరకూ ఉద్యోగుల విభజన.. ఆ నాలుగు శాఖలపైనే సాగదీత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. సీఎస్​ ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల వారీగా అలాట్​మెంట్​ ఆర్డర్లన్నీ ఈ నెల 20లోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ జోనల్​ స్థాయిలో సమస్యలు ఉత్ఫన్నమవుతుండటం, నాలుగైదు శాఖల నుంచి ఆటంకాలు ఎదురవుతుండటంతో విభజన పూర్తి కావడం లేదు. ఈ నెలాఖరు వరకు ఉద్యోగుల విభజన కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు సరిగా లేవు

నాలుగు ప్రధాన శాఖల నుంచి వివరాలు సరిగా లేకపోవడంతో ఆ ఫైళ్లను తిరిగి పంపుతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్​, పోలీస్​, వైద్యారోగ్య శాఖ నుంచి ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. వైద్యారోగ్య శాఖలో వైద్య విద్య విభాగం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విధానపరిషత్​, ఎన్​హెచ్​ఎం, టీఎస్​ఎంఎస్​ఐడీసీ, డ్రగ్​ కంట్రోల్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ వంటి విభాగాలున్నాయి. వీటిల్లో పని చేస్తున్న వారి సీనియార్టీ అంశం గజిబిజిగా మారింది. ఈ సీనియార్టీని తేల్చడంలో ఉద్యోగుల ఆప్షన్ల ప్రక్రియలో కూడా చాలా తప్పులు దొర్లినట్లు గుర్తించారు. దీంతో ఈ శాఖకు సంబంధించిన ఉద్యోగుల ఫైళ్లు పదేపదే తిప్పి పంపిస్తున్నారు. సీఎస్​ అనుకున్న ఫార్మాట్​లో రాకపోవడంతో ఫైళ్లు తిరిగి వెళ్తున్నాయి. అదే విధంగా రెవెన్యూ, పోలీస్​, ఇరిగేషన్​ శాఖలో కూడా అదే పరిస్థితి నెలకొంది. వీటితో పాటుగా ఎక్సైజ్​, కమర్షియల్​ ట్యాక్స్​, వ్యవసాయ శాఖ నుంచి కూడా సరైన విధంగా ఆప్షన్లు, వివరాలు రాకపోవడంతో వాటిపై సాగదీత కొనసాగుతోంది. దీంతో జోనల్​ స్థాయి ఉద్యోగుల విభజన ఆలస్యమవుతోంది.

కాగా ఆయా శాఖల నుంచి వస్తున్న ఫైళ్లను మూడంచెల విధానంలో పరిశీలన చేస్తున్నారు. ముందుగా ఒక ఫార్మాట్​ను కిందిస్థాయి నుంచే పంపిస్తున్నారు. ఆ తర్వాత సెకండ్​ కేడర్​ అధికారుల బృందం తనిఖీలు చేయాలని సోమవారం నుంచి సూచించారు. ఇక్కడ నుంచి ఆయా శాఖల హెచ్​ఓడీలు వాటిని పరిశీలించి తుది రిపోర్ట్​ను సిద్ధం చేసి కేటాయింపుల ప్రక్రియను చేపట్టుతున్నారు. అయితే ప్రతి శాఖకు సంబంధించిన ఫైళ్లను సీఎస్​ తనిఖీ చేస్తుండటంతో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ జోనల్​, మల్టీజోనల్​ కేటాయింపుల ప్రక్రియ మరో నాలుగైదు రోజులు సాగే అవకాశాలున్నట్లు అధికారులు చెప్పుతున్నారు. కాగా మంగళవారం రాత్రి ఫైలట్​గా మూడు శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు జోనల్​ కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు వస్తే మళ్లీ వాటిని పరిగణలోకి తీసుకుని పరిష్కరించనున్నారు.

తుది దశకు జోనల్ కేటాయింపు.. ఏప్రిల్​ తర్వాతే పోస్టింగ్!

Next Story