ఒడిదుడుకుల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!

by  |
ఒడిదుడుకుల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య మంగళవారం మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభ సమయంలో లాభాల్లో ట్రేడయినప్పటికీ మిడ్-సెషన్ అనంతరం కీలక రంగాల షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతేకాకుండా గత నెల రోజులుగా మెరుగైన ర్యాలీని కొనసాగిస్తున్న ఫార్మా రంగం షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నష్టాలు తప్పలేదు. అలాగే, దేశంలో కరోనా కేసుల పెరుగుదల ధోరణి కొనసాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, కీలక కంపెనీల షేర్లు డీలాపడంతో సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 465.01 పాయింట్లు పతనమై 48,253 వద్ద ముగియగా, నిఫ్టీ 137.65 పాయింట్లు కోల్పోయి 14,496 వద్ద ముగిసింది.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ మాత్రమే 3 శాతానికి పైగా పుంజుకోగా, మిగిలిన అన్ని రంగాల సూచీలు నీరసించాయి. ఫార్మా ఇండెక్స్ అధికంగా 2 శాతం డీలాపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, నెస్లె ఇండియా షేర్లు లాభాలను దక్కించుకోగా, డా రెడ్డీస్, రిలయన్స్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.80 వద్ద ఉంది.


Next Story