భారీ లాభాలను సాధించిన స్టాక్ మార్కెట్లు

by  |
భారీ లాభాలను సాధించిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. ఉదయం ప్రారంభంలో దూకుడుగా మొదలైన సూచీలు మిడ్-సెషన్ సమయంలో ఊగిసలాటకు గురైనప్పటికీ చివర్లో జోరును కొనసాగించాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 50 వేల మార్కును అధిగమించింది. ముఖ్యంగా మెటల్ రంగం షేర్లు 5 శాతం ర్యాలీ చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మౌలిక సదుపాయాల పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా ట్రిలియన్ డాలర్లను ప్రకటించిన అనంతరం టెక్ రంగంలో ర్యాలీ పెరిగింది. దీంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడగా, ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనబడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 520.68 పాయింట్లు ఎగసి 50,029 వద్ద ముగియగా, నిఫ్టీ 176.65 పాయింట్లు లాభపడి 14,867 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ 5 శాతం అత్యధికంగా ర్యాలీ చేయగా, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా రంగాలు పుంజుకున్నాయి. ఐటీ, రియల్టీ రంగాలు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నెస్లె ఇండియా, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.35గా ఉంది.



Next Story