స్టాక్ మార్కెట్లకు ఆర్‌బీఐ బూస్ట్!

by  |
స్టాక్ మార్కెట్లకు ఆర్‌బీఐ బూస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు రికార్డు లాభాలను సాధించాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించడంతో మార్కెట్లలో జోరు పెరిగింది. ఆర్థికవ్యవస్థ వృద్ధికి అవసరమైనంత కాలం సర్దుబాటు వైఖరినే అనుసరించనున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా అన్ని రంగాలు పుంజుకోవడం, దిగ్గజ కంపెనీల షేర్లు మెరుగ్గా ర్యాలీ చేయడంతో సూచీలకు కలిసొచ్చాయి. ముఖ్యంగా ఐటీ ఇండెక్స్ బుధవారం స్టాక్ మార్కెట్ల ర్యాలీకి ప్రధాన మద్దతుగా నిలిచాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,016.03 పాయింట్లు ఎగసి 58,649 వద్ద, 293.05 పాయింట్లు ర్యాలీ చేసి 17,469 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ అధికంగా 2.5 శాతం కంటే ఎక్కువ పుంజుకోగా, బ్యాంకింగ్, మీడియా, ఆటో, ఐటీ, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు 1.5-2.5 శాతం బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకి, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.49 వద్ద ఉంది.


Next Story

Most Viewed