ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

by  |
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు అధిక లాభాలను సాధించాయి. ఓ దశలో సెన్సెక్స్ ఇండెక్స్ 52 వేలకు చేరువలో కదలాడింది. అనంతరం మిడ్-సెషన్ సమయంలో మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా లాభాలను కోల్పోయాయని విశ్లేషకులు తెలిపారు. ముఖ్యంగా లాభాల స్వీకరణ కారణంగా మెటల్, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికమవడంతో మార్కెట్లు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2.56 పాయింట్లు కోల్పోయి 51,934 వద్ద ముగియగా, నిఫ్టీ 7.95 పాయింట్లు నష్టపోయి 15,574 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మెటల్, బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఆటో రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనగా, మీడియా, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.90 వద్ద ఉంది.


Next Story