భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

by  |
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది రోజులుగా భారీగా పతనమవుతున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలను సాధించాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా పలు గణాంకాలు మెరుగ్గా ఉండటంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడం, రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగడం, దేశీయంగా మార్కెట్లు దీర్ఘకాలంలో పుంజుకోగవలని మదుపర్లు భావించడం స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది.

అంతేకాకుండా గత రెండు వారాలుగా నష్టాల వల్ల ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లను కొనసాగించారని, దీనికితోడు ఫైనాన్స్, ఐటీ రంగాల్లో షేర్ల కొనుగోళ్లు అధికంగా ఉండటం మార్కెట్ల లాభాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇంకా అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లు రెండో అత్యధికంగా నమోదవడం, తయారీ కార్యకలాపాలు ఊపందుకోవడం వంటి పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపాయని విశ్లేషకులు వివరించారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 831.53 పాయింట్లు ఎగసి 60,138 వద్ద, నిఫ్టీ 258 పాయింట్లు లాభపడి 17,929 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ రంగం అత్యధికంగా 4 శాతం కంటే ఎక్కువ పుంజుకోగా, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా, ఫైనాన్స్, ఐటీ, బ్యాంకింగ్ ఇండెక్స్‌లు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా, రిలయన్స్ షేర్లు మాత్రమే నష్టాలను ఎదుర్కొన్నాయి.

మిగతా అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్ 7 శాతానికి పైగా ర్యాలీ చేసింది. హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, డా రెడ్డీస్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, టీసీఎస్, సన్‌ఫార్మా షేర్లు అధిక లాభాలను సాధించాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.92 వద్ద ఉంది.


Next Story

Most Viewed