స్టాక్ మార్కెట్ల రికార్డుల మోత!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఆటో రంగంలోని ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్ల తయారీ పరిశ్రమల ప్రోత్సాహానికి పీఎల్ఐ పథకాన్ని ప్రకటించడం, టెలికాం రంగాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు సంస్కరణలను తీసుకురావడం వంటి నిర్ణయాలతో మదుపర్ల సెంటిమెంట్ ఊపందుకుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచే లాభాలతో దూసుకెళ్లిన సూచీలు మిడ్-సెషన్ సమయానికి జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో చివర్లో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 417.96 పాయింట్లు ఎగసి 59,141 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 110.05 పాయింట్ల లాభంతో 17,629 వద్ద ముగిసింది.

నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజి, టెలికాం రంగాలు భారీగా పుంజుకోగా, మీడియా, ఐటీ, మెటల్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతానికి పైగా ర్యాలీ చేయగా, ఐటీసీ షేర్లు 6 శాతానికి పైగా పెరిగాయి. ఎస్‌బీఐ, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అధిక లాభాల్లో ట్రేడయ్యాయి. టీసీఎస్, టాటాస్టీల్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, డా రెడ్డీస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.48 వద్ద ఉంది. దేశీయ సంఘటనలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మార్కెట్లు భారీ లాభాలను సాధించగలిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి దిగ్గజ కంపెనీలు షేర్లు భారీగా ర్యాలీ చేశాయి.


Next Story

Most Viewed