లాభాల్లో దూసుకెళ్లిన సూచీలు.. ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ

by  |
లాభాల్లో దూసుకెళ్లిన సూచీలు.. ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. గత రెండు సెషన్లలో ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ర్యాలీ అయిన సూచీలు గురువారం రికార్డు స్థాయిలో కోలుకున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండటంతో ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనం సాధిస్తుందనే ఆశలతో మార్కెట్లు పుంజుకుంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెల్లడవనున్న కారణంగా మదుపర్లు ఉత్సాహంగా ఉన్నారని నిపుణులు తెలిపారు. అలాగే, కరోనా టీకా పురోగతి మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 381.92 పాయింట్లు ఎగసి 52,232 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114.15 పాయింట్లు పెరగడంతో రికార్డు గరిష్ఠాలైన 15,690 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఫార్మా రంగం మినహాయించి మిగిలిన అన్ని సూచీలు పుంజుకోగా, రియల్టీ ఇండెక్స్ అధికంగా 3 శాతానికి పైగా పెరిగింది. మీడియా, బ్యాంకింగ్, మెటల్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్ షేర్లు అత్యధికంగా 6 శాతానికి పైగా ర్యాలీ చేయగా, ఓఎన్‌జీసీ, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలు సాధించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, డా రెడ్డీస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.95 వద్ద ఉంది.



Next Story

Most Viewed