ఒడిదుడుకుల మధ్య లాభాలు దక్కించుకున్న మార్కెట్లు

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో లాభాలను దక్కించుకున్నాయి. మిడ్ సెషన్ సమయంలో అమ్మకాల ఒత్తిడికి గురైనప్పటికీ చివరికి లాభాల్లోనే కదలాడాయి. ముఖ్యంగా మెటల్, ఎనర్జీ రంగాల మద్దతుతో ర్యాలీ కొనసాగిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గురువారం ఫిబ్రవరి ఎఫ్అండ్ఓ సిరీస్ క్లోజింగ్ కారణంగానే మార్కెట్లు ఆటుపోట్లకు గురైనట్టు నిపుణులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 257.62 పాయింట్లు ఎగసి 51,039 వద్ద ముగియగా, నిఫ్టీ 115.35 పాయింట్లు లాభపడి 15,097 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ అధికంగా 4.15 శాతం పుంజుకోగా, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఆటో రంగాలు బలపడ్డాయి. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె ఇండియా, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.29 వద్ద ఉంది.



Next Story