వరుసగా రెండోరోజు నష్టపోయిన సూచీలు!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలను చవిచూశాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో లాభాలతో కొనసాగినప్పటికీ క్రమంగా నష్టాల్లోకి మారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా పలు రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో సూచీలు డీలాపడ్డాయి. ప్రధానంగా ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు భారీగా అమ్మకాలను ఎదుర్కొన్నాయి. వీటికితోడు కీలక రంగాల్లో షేర్లు నష్టపోవడంతో స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 273.51 పాయింట్లు కోల్పోయి 52,578 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 15,746 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఫార్మా ఇండెక్స్ అత్యధికంగా 4 శాతానికి పైగా పతనమవగా, ఈ రంగంలోని దిగ్గజ సంస్థ డా. రెడ్డీస్ 1.5 శాతం పడిపోయింది. అలాగే, రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఆటో, బ్యాంకింగ్ రంగం కుదేలయ్యాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, నెస్లె ఇండియా, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ షేర్లు లాభాలను దక్కించుకోగా, డా. రెడ్డీస్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్, ఐటీసీ, రిలయన్స్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.48 వద్ద ఉంది.

Next Story

Most Viewed