వరుసగా రెండోరోజూ ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

by  |
nifti
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ మిడ్-సెషన్ సమయానికి నష్టాలకు జారుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, దేశీయంగా కీలక సానుకూల సంఘటనలు లేకపోవడంతో సాధించిన లాభాలను సూచీలు కోల్పోయాయి. చివరి గంటలో కొంతమేర కోలుకున్నప్పటికీ స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆగష్టు నెలకు సంబంధించి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ముగుస్తున్న కారణంగానే మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారని, దీనివల్ల మిడ్-సెషన్ సమయంలో స్టాక్ మార్కెట్లు నష్టాలకు జారుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఈ పరిణామాలతో బీఎస్ఈ సెన్సెక్స్‌ 56 వేల కీలక మైలురాయి నుంచి దిగువన నమోదైంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 4.89 పాయింట్లు మాత్రమే లాభపడి 55,949 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 2.25 పాయింట్ల లాభంతో 16,636 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎనర్జీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు స్వల్పంగా పుంజుకోగా, మెటల్, టెలికాం, ఆటో, హెల్త్‌కేర్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాలను దక్కించుకోగా, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.23 వద్ద ఉంది.



Next Story

Most Viewed