రికార్డు లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస ఏడు రోజుల రికార్డు లాభాలను మంగళవారం బ్రేక్ పడింది. జీవితకాల గరిష్ఠాల వద్ద ఒక్కసారిగా మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో భారీ లాభాల నుంచి సూచీలు నష్టాలకు జారాయి. ఉదయం ప్రారంభంలోనే కీలక మైలురాయి 62,000 మైలురాయిని అధిగమించిన బీఎస్ఈ సెన్సెక్స్ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనక తప్పలేదు. నిఫ్టీ సైతం మొదట్లో ఐటీ రంగం నుంచి మద్దతు లభించినప్పటికీ చివర్లో దిద్దుబాటుకు గురయ్యాయి.

ఓ దశలో సెన్సెక్స్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద జీవితకాల గరిష్ఠాలను తాకాయి. కానీ, మిడ్-సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా లాభాలను కోల్పోయి నష్టాలవైపునకు మళ్లాయి. గత కొంతకాలంగా దేశీయ సంఘటనలతో గణనీయంగా ర్యాలీ చేసిన తర్వాత లాభాల స్వీకరణ వల్ల నష్టాలు తప్పలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 49.54 పాయింట్లు కోల్పోయి 61,716 వద్ద, నిఫ్టీ 58.30 పాయింట్లు నష్టపోయి 18,418 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఐటీ, క్యాపిటల్ గూడ్స్ మినహా అన్ని రంగాలు నష్టాలను చూశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్‌మహీంద్రా, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, టాటా స్టీల్, ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.04 వద్ద ఉంది.



Next Story

Most Viewed