దేశీయ మార్కెట్లు ‘హ్యాట్రిక్’ రికార్డుల ర్యాలీ!

by  |
దేశీయ మార్కెట్లు ‘హ్యాట్రిక్’ రికార్డుల ర్యాలీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లో రికార్డు గరిష్ఠాల పరంపర కొనసాగుతోంది. గత రెండు రోజులుగా భారీ లాభాలను సాధిస్తున్న స్టాక్ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో అదే ధోరణిని కొనసాగించాయి. ఉదయం అధిక లాభాలవైపుగా ర్యాలీ చేసినప్పటికీ మిడ్‌సెషన్ సమయంలో కొంత తడబడ్డాయి. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగాల్లో మెరుగైన కొనుగోళ్లు జరగడంతో సూచీల దూకుడు కొనసాగింది. బుధవారం ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి సమావేశం నిర్ణయాలను శుక్రవారం ప్రకటించనున్న నేపథ్యంలో సూచీలు కొంతమేర ఒడిదుడుకులకు లోనయ్యాయని, అలాగే ఎంపీసీ సమావేశ వివరాల ప్రకటన కారణంగా బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 123.07 పాయింట్లు లాభపడి 54,492 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 35.80 పాయింట్ల లాభంతో 16,294 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పతనమవగా, రియల్టీ, ఫార్మా, మీడియా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగాలు నీరసించాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఐటీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించగా, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆల్ట్రా సిమెంట్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.10 వద్ద ఉంది.


Next Story

Most Viewed