వరుసగా రెండో రోజూ నష్టపోయిన సూచీలు!

by  |
వరుసగా రెండో రోజూ నష్టపోయిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలను నమోదు చేశాయి. దేశీయంగా దిగ్గజ కంపెనీల షేర్లకు సంబంధించి మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల వల్ల సూచీలు నష్టపోయాయి. బుధవారం నాటి పతనానికి ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడమే అని విశ్లేషకులు తెలిపారు. మిడ్-సెషన్ తర్వాత నుంచి నష్టాలు అధికంగా కనిపించినప్పటికీ చివరి గంటలో స్వల్పంగా కొనుగోళ్లు నిర్వహించడం మూలంగా నష్టాలు కొంతమేర తగ్గాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం, బ్యాంకింగ్ సహా కీలక రంగాల్లో అమ్మకాల ధోరణి నష్టాలను కొనసాగించడానికి కారణాలని నిపుణులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 80.63 పాయింట్లను కోల్పోయి 60,353 వద్ద, నిఫ్టీ 27.05 పాయింట్ల నష్టంతో 18,017 వద్ద ముగిసింది.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ అధికంగా 2 శాతానికి పైగా పతనమవగా, మెటల్, రియల్తీ, ప్రైవేట్ బ్యాంక్, మీడియా రంగాలు నిరసించాయి. ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, రిలయన్స్, సన్‌ఫార్మా, ఐటీసీ, డా.రెడ్డిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, పవర్‌గ్రిడ్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.37 వద్ద ఉంది.


Next Story

Most Viewed