లాభాలతో దూసుకుపొతున్న స్టాక్ మార్కెట్..

by  |
markets
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మునుపటి జోరును కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుతో పాటు దేశీయ రంగాల్లో మెరుగైన కొనుగోళ్లు జరగడంతో సోమవారం సైతం మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. వీటికి తోడు ఎఫ్ఐఐలు గణనీయంగా పెరగడం, ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉండటం, రూపాయి మారకం విలువ బలంగా ఉండటం, కొవిడ్ సంబంధిత సానుకూల పరిణామాలతో సూచీలు ఆల్‌టైమ్ రికార్డుల వద్ద ర్యాలీ చేశాయి. ముఖ్యంగా రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా లాంటి కీలక కంపెనీలు షేర్లు లాభాల పంట పండించడంతో సూచీలు వరుసగా ఏడోరోజు రికార్డు స్థాయిలో ట్రేడింగ్‌ను ముగించాయి.

ఉదయం ప్రారంభం నుంచే ఉత్సాహంగా ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే మదుపర్ల ఆశలు మరిన్ని లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 58,516 వరకు దూసుకెళ్లింది. అనంతరం పలు రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 166.96 పాయింట్లు ఎగసి 58,296 వద్ద క్లోజయింది. నిఫ్టీ 54.20 పాయింట్లు పెరిగి 17,377 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, రియల్టీ పుంజుకోగా, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగాల్లో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం షేర్లు లాభాలను సాధించగా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.09 వద్ద ఉంది.


Next Story