లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. సోమవారం ఉదయం లాభాలతోనే మొదలైన సూచీలు క్రమంగా అమ్మకాల ఒత్తిడి వల్ల నష్టాల్లోకి జారాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం అందించే అవకాశం లేదని వచ్చిన నివేదికల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరించారని విశ్లేషకులు తెలిపారు.

మరోవైపు ఒమిక్రాన్ ఆందోళనలతో పాటు ద్రవ్యోల్బణ పరిణామాలు దలాల్ స్ట్రీట్‌లో మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ ప్రతికూల పరిణామాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ నుంచి పతనమవుతూ అధిక నష్టాలను చవిచూశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 503.25 పాయింట్లు కుదేలై 58.283 వద్ద, నిఫ్టీ 143.05 పాయింట్లు నష్టపోయి 17,368 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మీడియా ఇండెక్స్ అధికంగా 1.8 శాతం నీరసించగా, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాలను దక్కించుకోగా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.79 వద్ద ఉంది.


Next Story

Most Viewed