స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న నష్టాలు!

by  |
స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల మధ్య భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం నుంచే ప్రతికూలంగా మొదలైన తర్వాత చివరి వరకు అదే ధోరణిలో ర్యాలీ చేశాయి. ముఖ్యంగా టోకు ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠానికి చేరడంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సూచీలు అధిక నష్టాలను చూశాయి. రోజంతా కొనుగోళ్లకు మద్దతు లభించకపోవడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 396.34 పాయింట్లు కోల్పోయి 60,322 వద్ద, నిఫ్టీ 110.25 పాయింట్లు నష్టపోయి 17,999 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్ అధికంగా 2 శాతం క్షీణించింది.

ప్రైవేట్ బ్యాంక్, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు డీలాపడ్డాయి. అయితే సెమీకండక్టర్ల కొరత ఆందోళనలకు పరిష్కారం వస్తుందనే నివేదికలతో ఆటో రంగం పుంజుకుంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, టెక్‌మహీంద్రా, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను దక్కించుకోగా, రిలయన్స్, ఎస్‌బీఐ, ఆల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, టాటా స్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.37 వద్ద ఉంది.


Next Story

Most Viewed