స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!

by  |
స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య మంగళవారం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడినప్పటికీ మిడ్ సెషన్ తర్వాత సూచీలు కోలుకున్నాయి. ముఖ్యంగా ఉదయం ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్య ఇచ్చారనీ, అందుకే చివరి వరకు ఒడిదుడుకులు తప్పలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా ఉండటం, దేశీయ దిగ్గజ కంపెనీల షేర్లు నీరసించడంతో మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, తర్వాత కొనుగోళ్లు పెరగడంతో నెమ్మదిగా ఆటు పోట్ల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయని భావిస్తున్నారు.

స్వల్ప లాభాలే అయినప్పటికీ రికార్డు స్థాయిలోనే మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 9.71 పాయింట్ల లాభంతో 46,263 వద్ద ముగియగా, నిఫ్టీ 9.70 పాయింట్లు లాభపడి 13,567 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, ఫార్మా, రియల్టీ రంగాలు బలహీనపడగా, మెటల్, మీడియా, ఆటో రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం షేర్లు లాభాలను దక్కించుకోగా, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, టీసీఎస్, ఐటీసీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.57 వద్ద ఉంది.

Next Story