భారీ నష్టాలతో కుదేలైన మార్కెట్లు!

by  |
భారీ నష్టాలతో కుదేలైన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: గత వారం రోజుల నుంచి జోరుగా ఉన్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు డీలా పడ్డాయి. సూచీలన్నీ పేకమేడలా కుప్పకూలాయి. గత మూడు వారాల్లో భారతీయ ఈక్విటీ మార్కెట్లు అతిపెద్ద సింగిల్ డే నష్టాలను గురువారం నమోదు చేశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం క్షీణతను నమోదు చేస్తుందని ఫెడ్ అంచనాలకు తోడు అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురవ్వడంతో నష్టాలు తప్పలేదు. దీంతో దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలకు సంబంధించి స్వీయ మదింపుపై విచారణను సుప్రీంకోర్టు జూన్‌ 18కి వాయిదా వేయడం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపించింది. ఉదయం నుంచే మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. తర్వాత ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 708.68 పాయింట్లను కోల్పోయి 33,538 వద్ద ముగియగా, నిఫ్టీ 214.15 పాయింట్ల నష్టంతో 9,902 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన సూచీలన్నీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా డాలరు‌తో రూపాయి మారకం విలువ రూ. 75.78 వద్ద ఉంది.

తప్పని చమురు వడ్డన ..

గత నాలుగు రోజులుగా రోజుకో రూపాయి చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న ఆయిల్ కంపెనీలు ఐదో రోజు ధరలను పెంచేశాయి. పెట్రోల్, డీజిల్ రెంటిపైనా లీటర్‌కు రూ. 1 పెంచాయి. దీంతో, ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ. 2.74, డీజిల్ రూ. 2.83 పెరిగి వాహనదారులకు వణుకుపుట్టిస్తున్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు :

* హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 76.82, డీజిల్ రూ. 70.59గా ఉంది.
* ఢిల్లీలో పెట్రోల్‌ రూ.74, డీజిల్‌ రూ.72.22
* ముంబైలో పెట్రోల్ రూ. 80.98, డీజిల్ రూ.70.92.
* చెన్నై పెట్రోల్ రూ. 77.96, డీజిల్‌ రూ. 70.64గా ఉంది.
* బెంగళూరులో పెట్రోల్ రూ. 76.39. డీజిల్ రూ. 68.66గా ఉంది.



Next Story

Most Viewed