సరికొత్త రికార్డులతో మార్కెట్ల స్పీడ్!

by  |
సరికొత్త రికార్డులతో మార్కెట్ల స్పీడ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది కొవిడ్-19 మహమ్మారి కారణంగా మార్చిలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 25,981 పాయింట్లతో దారుణంగా పతనమైంది. ఆ తర్వాత నెమ్మదిగా కరోనాకు అలవాటు పడుతూ.. ఎనిమిది నెలల తర్వాత మంగళవారం రికార్డు స్థాయిలో చారిత్రాత్మక గరిష్ఠం 43 వేల మార్కును దాటింది. ఈ ఏడాదిలో కరోనాకు ముందు జనవరిలో మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టం 42 వేల మార్కును తాకాయి. మళ్లీ ఇన్ని నెలల తర్వాత ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి రికార్డులను అధిగమించాయి. కరోనా విషయంలో తొలిరోజుల్లో ఉన్న స్థాయి ఆందోళన, భయం ఇప్పుడు మార్కెట్లలో లేదు. పైగా, కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తుందనే సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉందని, అందుకే సూచీలు రికార్డు గరిష్ఠాలను అందుకున్నాయని హీలియోస్ కేపిటల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా చెప్పారు.

సోమవారం భారీ లాభాలతో ముగిసిన అనంతరం మంగళవారం సూచీలు రోజంతా లాభాల్లోనే ర్యాలీ చేశాయి. వరుసగా ఏడో రోజు బుల్ మార్కెట్ దూకుడును కొనసాగించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 680.22 పాయింట్లు ఎగసి 43,277 వద్ద ముగియగా, నిఫ్టీ 170.05 పాయింట్లు లాభపడి 12,631 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం అత్యధికంగా 4 శాతం ర్యాలీ చేయగా, రియల్టీ పుంజుకుంది. ఐటీ, ఫార్మా రంగాల షేర్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు అధిక లాభాలను దక్కించుకోగా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, నెస్లె ఇండియా, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.29 వద్ద ఉంది.

Next Story

Most Viewed