భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు!

by  |
భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను నమోదు చేశాయి. కోవిడ్-19 కొత్త వేరియంట్ భయాలకు తోడు దేశీయంగా అమ్మకాల ఒత్తిడి అధికం కావడంతో సూచీలు పతనమయ్యాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు సిద్దపడటంతో ఐటీ, ఫార్మా రంగాలు కుదేలయ్యాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు 3 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో లాభాల్లోనే ట్రేడయిన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారాయి. మిడ్-సెషన్ తర్వాత మరింత కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు చివరికి అధిక నష్టాలను చూశాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు బలహీన పడిన రూపాయి మారకం, విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు సిద్ధపడటం లాంటి పరిణామాలు మార్కెట్ల నష్టాలకు కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 949.32 పాయింట్లు కోల్పోయి 56,747 వద్ద, నిఫ్టీ 284.45 పాయింట్లు నష్టపోయి 16,912 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ అధికంగా 3 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, మెటల్, బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు 1-1.8 శాతం మధ్య నిరసించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో అన్ని కంపెనీల షేర్లు నష్టపోవడం గమనార్హం. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, డా రెడ్డీస్, పవర్‌గ్రిడ్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.40 వద్ద ఉంది.


Next Story

Most Viewed