వరుసగా రెండోరోజూ లాభాల్లో సూచీలు

by  |
వరుసగా రెండోరోజూ లాభాల్లో సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలను సాధించాయి. సోమవారం నాటి ధోరణిలోనే ఉదయం ప్రారంభం నుంచి లాభాల్లో ట్రేడయిన సూచీలు చివరి వరకు అదే స్థాయిలో ర్యాలీ చేశాయి. ముఖ్యంగా, మంగళవారం నాటి ట్రేడింగ్‌కు అమెరికా మార్కెట్లు బలాన్నిచ్చాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లలో దాదాపు అన్ని రంగాలు సానుకూలంగానే కదలాడాయి. ప్రధానంగా మెటల్, టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు స్టాక్ మార్కెట్లకు మద్దతిచ్చాయని నిపుణులు తెలిపారు. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్ వంటి కీలక షేర్లు ర్యాలీ చేయడంతో సూచీలు లాభాలను కొనసాగించాయని వారు పేర్కొన్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 557.63 పాయింట్లు ఎగసి 48,944 వద్ద ముగియగా, నిఫ్టీ 168.05 పాయింట్లు లాభపడి 14,653 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ రంగం అధికంగా 2.5 శాతం పుంజుకోగా, బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో షేర్లు అధిక లాభాల్లో ట్రేడవ్వగా, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.62 వద్ద ఉంది.


Next Story