జమ్మికుంటలో సంచలనం రేపిన హత్య.. రంగంలోకి సీపీ

by  |
Murder
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి సంతోష్ (39) అలియాస్ సంతు హత్య మండలంలో సంచలనాన్ని రేకెత్తించింది. నిత్యం అందరితో కలివిడిగా ఉండే సంతోష్‌ను ఆదివారం రాత్రి అతి కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లిన సంతోష్ సోమవారం తెల్లవారుజామున జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామ శివారులో శవమై తేలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విషయం తెలుసుకున్న కరీంనగర్ సీపీ సత్యనారాయణ, హుజురాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి, జమ్మికుంట టౌన్ సీఐ రామ్ చందర్ రావులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. సంతోష్ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు 6 స్పెషల్ టీంలను రంగంలోకి దింపాలని, ఈ ఘటనలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. మృతుడి భార్య కోమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. కాగా తన తమ్ముడి హత్యకేసులో స్థానికుల పాత్ర ఉందంటూ సంతు అక్క సీపీ సత్యనారాయణ ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది.

పెట్రోల్ ఎక్కడి నుండి వచ్చింది…?

అతి దారుణంగా హత్యకు గురైన సంతోష్ మృతదేహం పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సంఘటనా స్థలాన్ని బట్టి తెలుస్తుంది. అయితే సంతోష్ మృతదేహంపై పోసిన పెట్రోల్ ఘటనా స్థలానికి దగ్గర్లో ఉన్న కోరపల్లి గ్రామం నుండి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో పెట్రోలు అమ్మిన వ్యక్తుల నుండి ఎవరు గోలు చేశారనే దానిపైనే పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.

Next Story