ఉదయ్‌కుమార్‌‌రెడ్డి హత్య: అసలు కారణం ఇదే!

by  |
ఉదయ్‌కుమార్‌‌రెడ్డి హత్య: అసలు కారణం ఇదే!
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామ శివారులో ఇటీవల జరిగిన ఉదయ్ కుమార్ రెడ్డి (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు వెల్లడించారు. నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం హత్య కేసు విషయాలను హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ మీడియాకు తెలిపారు.‘‘ హత్యకేసు నిందితుడు గొర్రెంకుల బాలు యాదాద్రి భువనగిరి జిల్లా రఘునాథపురం గ్రామానికి చెందిన వాడు. తన మేనత్త కూతురుని ఉదయ్ కుమార్ రెడ్డి చదివిస్తానని తీసుకువెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడని బాలు తెలుసుకున్నాడు. దీంతో బాలు జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం చౌదర్పల్లికి చెందిన తన మిత్రుడు పరశురాములు సహాయంతో ఉదయ్ కుమార్ రెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఉదయ్‌కుమార్ రెడ్డి వ్యాపార నిమిత్తం కారులో కొంగరకలన్ వెళ్లి వస్తుండగా పోచన్నపేట దగ్గర ఆపి, పార్టీ చేసుకుందామని నమ్మించి బచ్చన్నపేట‌లోని వైన్ షాప్‌లో మద్యం కొనుగోలు చేశారు. దారి మధ్యలో కొడవటూరు గ్రామం వద్ద కారు ఆపి మద్యం తాగారు. అక్కడ హత్యకు వీలు కాకపోవడంతో అదే కారులో ముగ్గురు కలసి చేర్యాల పట్టణానికి వచ్చారు. వైన్ షాప్‌లో మరోసారి మద్యం తీసుకొని వేచరేణి శివారులోని తాడూరు ఎక్స్ రోడ్డు దాటిన తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డికి పుల్‌గా మద్యం తాగించారు. అనంతరం బాలు అతని మిత్రుడు పరశురాములు ఉదయ్ కుమార్ రెడ్డి గొంతు కోసే ప్రయత్నం చేయగా.. ఉదయ్ కుమార్ రెడ్డి తప్పించుకొని మెయిన్ రోడ్డు పైకి వచ్చి వాహనాలను ఆపుతుండగా గొర్రెంకుల బాలు కారుతో ఢీ కొట్టాడు. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డి రోడ్డు పక్కన ముళ్లపొదల్లో పడిపోయాడు. అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డి చనిపోయినట్లు నిర్ధారించుకున్న బాలు, పరశురాములు అదే కారులో వెళ్లిపోయారు. అనంతరం కారును జనగామ జిల్లా బచ్చన్నపేట వద్ద దాచారు.’’ అని కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. కాల్ డేటా ఆధారంగా నిందితులు ఇద్దరినీ గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed