తెలంగాణ పల్లెల్లో మళ్లీ గుప్పుమన్న ‘గుడుంబా’..

by  |
తెలంగాణ పల్లెల్లో మళ్లీ గుప్పుమన్న ‘గుడుంబా’..
X

దిశ, కోటపల్లి : తెలంగాణ పల్లెల్లో మరోసారి గుడుంబా గుప్పుమంది. నిరుపేదలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు సాగిస్తున్నారు. అంతే కాకుండా స్థానికంగా గుడుంబాను తయారు చేసి ఇతర ప్రాంతాలకు సైతం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గుడుంబాకు అలవాటు పడితే అనారోగ్య సమస్యలతో ఫ్యామిలీలు చిన్నాభిన్నం అవుతున్నాయి. రాష్ట్రాన్ని గుడుంబా రహితంగా మార్చాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ, ఎక్సైజ్ అధికారుల అండదండలతోనే గ్రామాల్లో గుడుంబా, లిక్కర్ దందా జోరుగా సాగుతోంది.

అధికారుల అండతో గుడుంబా..

గుడుంబా తయారీకి బెల్లం, పటిక, జీడిగింజలు అవసరం. ఈ పటిక బెల్లం మహారాష్ట్ర మరియు చెన్నూర్ పట్టణం నుంచి అధికారుల అండతోనే గ్రామాలకు సరఫరా అవుతుంది. ఇదేంటని అధికారులను అడిగితే పటిక, బెల్లం కలిపి వాహనంలో వస్తేనే పట్టుకుంటామని డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. గ్రామాల్లో గుడుంబా దందా చేస్తున్న వారిని టార్గెట్ చేసుకుని ఎక్సైజ్ అధికారులు వ్యాపారుల నుంచి డబ్బులు దండుకుని వారిని వదిలేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో మళ్లీ గుడుంబా వాసన గుప్పు మంటోంది.

కమిషన్లతో లిక్కర్ దందా..

తాజాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అలుగామ గ్రామం నుంచి లిక్కర్ అక్రమంగా అధికారుల అండతో మహారాష్ట్రకు తరలుతోంది. ఈ లిక్కర్ దందా చేసేవారు నెలకు కొన్ని డబ్బులు అధికారులకు ముట్టచెప్పి నేరుగానే లిక్కర్ దందా చేస్తున్నారు. ఎవరైనా ఇదేంటని అధికారులను అడిగితే లిక్కర్ అనేది ప్రభుత్వ ఆదాయం. దానిని సపోర్ట్ చేస్తాం తప్పా పట్టుకోబోమని నిర్భయంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed